హైదరాబాద్ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ -2020 నిర్వాహకులపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ .. టోర్ని నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు. ఆటగాళ్ల సంక్షేమం, భావాలు పట్టించుకోకుండా.. కేవలం డబ్బుల కోసమే వారు టోర్నిని నిర్వహించారని ఆమె అన్నారు. అంతకుమించి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2020 నిర్వహించడానికి ఒక్క కారణం కూడా లేదని అన్నారు. ట్విటర్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నిర్వహణకు సంబంధించి డెన్మార్క్ ఆటగాడు మాడ్స్ కాన్రాడ్ పీటర్సన్ చేసిన ట్విట్పై సైనా ఈ విధంగా స్పందించారు.
'ఓవైపు కరోనా భయంతో ప్రపంచం అంతా మూత పడుతుంటే.. సాధారణ పరిస్థితుల మధ్య నేను ఆల్ ఇంగ్లండ్ టోర్ని ఆడటంతో భయమేస్తుంది. 14 రోజుల పాటు నేను అనారోగ్యంగానే ఉన్నానని భావించాల్సి ఉంటుంది' అని మాడ్స్ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లను రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేక ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించడమో చేస్తున్నారు. కానీ బర్మింగ్హామ్లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ను సాధారణ పరిస్థితుల మధ్యనే నిర్వహించారు.